బాలల రామాయణం
1. వల్మీక మహర్షి
అనగనగా ఒక అడవి. అడవిలో ఒక చిన్న పల్లె.
పల్లెలో ఒక వేటగాడిఇల్లు.
కుటుంబం పెద్దది అయ్యింది.
దారిదోపిడి మొదలు పెట్టాడు.
దోపిడి దొంగగ మారాడు.
అడవి నుండి పోయేవాళ్ళను దోచేవాడు.
అట్లా ఉండగా ఒకరోజు.
ఏడుగురు మునులు కనిపించారు.
ఉన్నది ఇమ్మని వారిని బెదిరించాడు.
ఇస్తాం సరే కాని ... ప్రశ్నకు జవాబు ఇవ్వు అన్నారు.
దోచింది ఏం చేస్తావు అని అడిగారు.
పెళ్ళాం బిడ్డలకు పంచుతాను అన్నాడు.
మరి.. దోపిడితో వచ్చే పాపం
కూడా పంచుతావా అని అడిగారు.
లేదని జవాబు ఇచ్చాడు.
దాన్ని పంచుకోవడం ఇష్టమా. అడిగి రమ్మన్నారు.
అంతవరకు తాము ఉంటాము అన్నారు.
ఇంటికి వెళ్ళి, అడిగాడు తన వారిని.
తిండి పెట్టడం నీ బాధ్యత.
మాకు సంబంధం లేదు అన్నారు.
నిరాశగా తిరిగి వచ్చాడు.
మునులను దారి చూపమన్నాడు.
తపస్సు చేయమని వెళ్ళారు.
దారిలో నారదుడు కనిపించాడు.
మరా అని ధ్యానం చేయమన్నాడు.
మరా జపం రాను రాను రామ అయింది.
ఏళ్ళకు ఏళ్ళు గడిచాయి.
చుట్టూ పుట్ట పెరిగింది.
పుట్టను వల్మీకం అంటారు.
అందుకే వాల్మీకి అన్నారు.
చివరికి బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు.
దివ్యదృష్టిని ప్రసాదించాడు.
రామాయణం రాయమని వెళ్ళి పోయాడు.
ఒకనాడు...స్నానానికి నదికి పోతున్నాడు.
దారిలో ఒక పక్షి కనిపించింది.
బాణం దెబ్బతో గిలగిలలాడింది.
చివరికి ప్రాణం వదిలింది.
దాని జంట పక్షి ఏడుస్తూ...
చుట్టూ తిరగసాగింది.
వాల్మీకికి కోపం వచ్చింది.
బాణం వేసిన వాడిని శపించాడు.
ఆ శాపంలో శ్లోకం ఉంది.
దానినే మననం చేసుకున్నాడు.
అదే రీతిగా రాయడం మొదలు పెట్టాడు.
అదే రామాయణం అయింది.
2. రామ జననం
అయోధ్య రాజు దశరథుడు.
అతనికి భార్యలు ముగ్గురు.
అయినా సంతానం కలగలేదు.
ఎన్నో నోములు నోచారు.
ఎన్నో యాత్రలు చేసారు.
ఎన్నో వ్రతాలు చేసారు.
అయినా లాభం కాలేదు.
కుమిలి పోతూ ఉన్నారు.
ఎవరెవరినో అడిగారు.
ముసలితనం వచ్చేసింది.
ఇక సంతాన యోగం లేదనుకున్నారు.
గురువులతో మాట్లాడారు.
వారు ఒక యజ్ఞం చేయమన్నారు.
పుత్రకామేష్టి దాని పేరు.
ఆ యజ్ఞం చేసారు.
యజ్ఞపురుషుడు వచ్చాడు.
ప్రసాదంగా పాయసం ఇచ్చాడు.
దానిని భార్యలకు పంచమన్నాడు.
దశరథుడు నాలుగు భాగాలు చేసాడు.
కౌసల్య, కైకేయిలకు ఒక్కొక్క భాగాన్ని,
సుమిత్రకు రెండు భాగాలను ఇచ్చాడు.
కొంతకాలానికి వారికు పుట్టారు పిల్లలు.
కౌసల్యకు రాముడు,
కైకేయికి భరతుడు,
సుమిత్రకు లక్ష్మణ, శతృఘ్నులు.
అయోధ్య సంతోషించింది.
పండుగ వాతావరణం కనిపించింది.
పెద్దవాడు రాముడు బుద్ధిమంతుడు.
మిగతా తమ్ములు అతనికి సరిపోతారు.
రాముడికి లక్ష్మణుడు చాలా దగ్గర.
భరతునికి శతృఘ్నుడు దగ్గర.
ఆటపాటలు ఆడుతున్నారు.
పెరిగి పెద్దవారవుతున్నారు.
వారికి విద్యాభ్యాసం జరిగింది.
గురువు దగ్గరికి వెళ్ళారు.
ఎన్నో విద్యలు నేర్చుకున్నారు.
3. యాగ సంరక్షణ
అన్నదమ్ములకు ఆదర్శంగా నిలిచారు.
ఒకనాడు విశ్వామిత్రుడనే ముని వచ్చాడు.
దశరథుడు అతనికి అతిథిమర్యాద చేసాడు.
వచ్చిన పని ఏమిటి అని అడిగాడు.
ఏదంటే అది ఇస్తాను అని మాట ఇచ్చాడు.
వెనుక అడుగు వేయనని భరోసా ఇచ్చాడు.
విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు.
తాను ఒక యాగం చేస్తున్నాను అన్నాడు.
అది సరిగా సాగడం లేదు.
దానికి కారణం రాక్షసులు అన్నాడు.
కాపాడటానికి రాముడిని పంపమన్నాడు.
దశరథుని గుండెల్లో రాయిపడింది.
తాను ఎంతో ప్రేమించే కొడుకు. తానే వస్తాను అన్నాడు.
ముని కుదరదు అన్నాడు.
దశరథుడు విలపిస్తు ఉన్నాడు.
రాముడు ఇది గమనించాడు.
తండ్రికి ధైర్యం చెప్పాడు.
లక్ష్మణుడు తోడుగ పోతాను అన్నాడు.
పెద్దలు ధైర్యం చెప్పారు. అయిష్టంగానే ఒప్పుకున్నాడు.
అన్నదమ్ములు బయలు దేరారు.
ముని ముందుగ వెళుతున్నాడు.
దారిలోని విశేషాలు చెపుతున్నాడు.
బల, అతిబల అనే విద్యలను నేర్పాడు.
ముందుకు ముందుకూ సాగుతున్నారు.
దారిలో ఒక్కసారిగా తాటక అనే రాకాసి.
భయంకరంగా ఉన్నది. మాయలు ఎన్నో చేసింది.
విశ్వామిత్రుడు దానిని చంపమన్నాడు.
స్త్రీ అని జాలి చూపవద్దన్నాడు.
రాముడు బాణం వేసాడు.
దెబ్బకు అది చచ్చింది.
ఇంకా ముందుకు సాగారు.
దారిలో రాయి రాముని కాలికి తగిలింది.
అంతలో అది అహల్యగ మారింది.
ఆమె కథ చెప్పాడు విశ్వామిత్రుడు.
తరువాత తన ఆశ్రమానికి దారితీసాడు.
తమ బాణాలతో ఆకాశంలో వల చేసారు.
రాక్షసమాయలు పారలేదు.
ఆఖరున రాముడు బాణం వేసాడు.
సుబాహుడు మరణించాడు.
మారీచుడు పారిపోయాడు.
యజ్ఞం విజయవంతంగా ముగిసింది.
మునివారిని మిథిలకు తీసుకుపోయాడు.
సీతాస్వయంవరంలో పాల్గొనమన్నాడు.
అక్కడ శివధనుస్సును ఎక్కుపెట్టాలి.
ఎక్కుపెట్టిన వారినే సీత పెళ్ళాడుతుంది.
4, సీతారాముల కల్యాణం
రాముడు విశ్వామిత్రుని అనుమతి పొందాడు.
మెల్లగా విల్లు వైపు కదిలాడు.
శివధనుస్సుకు దండం పెట్టాడు.
శివుని విల్లును ఎత్తాడు.
తాడును కట్టడానికి ఎక్కుపెట్టాడు.
శివుని విల్లు ఫెళఫెళమంటూ విరిగింది.
అందరి మొహాలలో సంతోషం .
అందాలసీత వచ్చింది.
రాముని మెడలో దండను వేసింది.
ఆమె మెడలో రాముడు దండ వేసాడు.
సీత తండ్రి జనకుడు ఆనందించాడు.
రాముని తండ్రి దశరథుడు సంతోషించాడు.
ప్రజలందరూ పండుగ చేసుకున్నారు.
రాముని తమ్ములకు కూడా పెండ్లి జరిగింది.
పెద్దలంతా ఆశీర్వదించారు.
దేవతలు పూలవాన కురిపించారు.
ఇంతలో...
కోపంగా వచ్చాడు పరశురాముడు.
శివధనుస్సును ఎందుకు విరిచావన్నాడు.
అదే విరిగింది అన్నాడు రాముడు.
అయితే దీనిని ఎత్తమన్నాడు పరశురాముడు.
విష్ణు ధనుస్సును అందించాడు.
అందుకున్నాడు రాముడు .
పరుశురాముని శక్తి రామునికి వచ్చింది.
పరశురాముడు మెచ్చుకున్నాడు.
రాముడిని అందరూ అభినందించారు.
దశరథుడు హమ్మయ్య అనుకున్నాడు.
జనకుడు ఊపిరి పీల్చుకున్నాడు.
అందరూ అయోధ్యకు బయలుదేరారు.
అక్కడా పండుగ వాతావరణం.
5. ఇచ్చిన మాట
అయోధ్యలో ఆనందం తాండవిస్తోంది.
ఆనందంలో కాలం తెలవడం లేదు.
దశరథునికి ఒక ఆలోచన వచ్చింది.
రామునికి రాజ్యం ఇస్తాను అన్నాడు.
ప్రజలందరూ అదే కోరుకున్నారు.
ఇక అంతా మంచే అనుకున్నారు.
కాని...
చిన్నమ్మ కైకేయి వద్దు అన్నది.
తన కొడుకు భరతునికి పట్టం కట్టమన్నది.
రాముని పదునాల్గేండ్లు అడవికి పంపు అన్నది.
తనకు ఇచ్చిన మాటను గుర్తు చేసింది.
దశరథుడు ఎంతో విలపించాడు.
రామునికి ఈ సంగతి తెలిసింది.
రాముడు అయోధ్యను విడిచాడు.
వనాల వైపు కదిలాడు.
సీత రాముని అనుసరించింది.
లక్ష్మణుడు నీడగ తోడుగ వచ్చాడు.
అడవేమో పులకించింది.
పక్షులు ఈలలు వేసాయి.
కోతులు ఆనందంతో ఎగిరాయి.
మునులకు సంతోషం అయ్యింది.
రాక్షసులకు గుండె చెదిరింది.
అక్కడ...
దశరథుని గుండె పగిలింది.
శ్రవణకుమారుడు గుర్తుకు వచ్చాడు.
దానితో విలపిస్తూ మరణించాడు.
అయోధ్య గుండె బరువెక్కింది.
అంతటా చీకటిముసిరింది.
6. పాదుకా పట్టాభిషేకం
అయోధ్యకు భరతుడు వచ్చాడు.
జరిగిన విషయం తెలిసింది.
అమ్మ కైకేయిని తిట్టాడు.
రాముడు లేని రాజ్యం వద్దు అన్నాడు.
అన్న రాముని కోసం అడవికి వెళ్ళాడు.
వెంట అయోధ్య కూడా కదిలింది.
అడవిలో అన్నను కలిసాడు.
వనవాసం వలదు అన్నాడు.
ప్రజలు ఔనౌను అన్నారు.
వనవాసం విడువుమన్నారు.
కైకేయికూడా వద్దన్నది .
రాముడు మాత్రం తండ్రిమాట నిలిపాడు.
అయోధ్యకు రాలేను అన్నాడు.
అయితే ...భరతుడు పాదుకలు ఇమ్మన్నాడు.
పాదుకలతో రాజ్యం నడుపుతాను అన్నాడు.
ఇక తప్పదని రాముడు పాదుకలిచ్చాడు.
వాటిని తలపై పెట్టుకున్నాడు భరతుడు.
నంది గ్రామం వైపు నడిచాడు.
ప్రజలు కూడ వెనుదిరిగారు.
పాదుకలు సింహాసనంపై పెట్టారు.
భరతుడు బాధ్యత తీసుకున్నాడు.
రామసేవకునిగా రాజ్యం చేసాడు.
7. మాయజింక
అడవిలో సీతారామ లక్ష్మణులు. పర్ణశాలను నిర్మించారు.
ప్రకృతిని ఆస్వాదిస్తు ఉన్నారు. ఆనందంగా గడుపుతు ఉన్నారు.
ఆ అడవిలో ఉన్నది శూర్పణఖ.
ఆ శూర్పణఖ ఒక రాకాసి. అడవిలో రాముడిని చూసింది.
పెళ్ళి చేసుకోవాలి అని తలచింది .
సుందర రాముడిని అడిగింది.
తనకు పెళ్ళి అయిందని అన్నాడు రాముడు.
తన భార్య సీతను చూపించాడు.
తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు అన్నాడు.
అతడు ఒప్పుకుంటె చేసుకోమన్నాడు.
ఆమె లక్ష్మణుని దగ్గరికి వెళ్ళింది.
అతను కుదరదని చెప్పాడు.
అయినా ఆమె వినలేదు. లక్ష్మణుడు ఆమెను ఒప్పలేదు.
సీతను చంపుతాను అన్నది శూర్పణఖ. లక్ష్మణునికి కోపం వచ్చింది.
ఆమె ముకుచెవులను కోసాడు. శూర్పణఖ భోరున ఏడ్చింది.
లంకకు చక్కగ పోయింది.
రావణునికి సంగతి చెప్పింది. అన్న రావణుడు ఓదార్చాడు.
శూర్పణఖ కోపం తగ్గలేదు.
సీత అందం పొగిడింది .
సీతను చెరబట్టు అన్నది. అపుడే తనకు శాంతి అన్నది.
రావణుడు సరే అని అనునయించాడు.
మారీచునికి కబురు పంపాడు.
అతని సహాయం కోరాడు.
రాముని మోసం చేయమన్నాడు.
వల్లకాదు అన్నాడు మారీచుడు. తన ప్రాణాలకే ముప్పు అన్నాడు.
తానే చంపేస్తాను అన్నాడు రావణుడు.
మారీచుడు సరే అన్నాడు.
రాముడి చేత చావే నమయనుకున్నాడు
ఇద్దరు పర్ణశాల కు వచ్చారు.
మారీచుడు బంగరు జింకగ మారాడు.
గడ్డి తింటున్నట్టు నటిస్తు ఉన్నాడు.
జింకను సీత గమనించింది. దానిని తెచ్చి ఇమ్మని కోరింది.
రాముడు ఏదో మోసం అన్నాడు.
లేదు తనకు జింకను తెమ్మని ప్రార్థించింది.
సరే అన్నాడు రాముడు.
జింకను వెంటాడాడు .
అది ఎటెటో పోతున్నది.
చాలా సమయం గడిచింది.
లాభం లేదని బాణం వేసాడు.
దెబ్బకు మారీచుని ప్రాణం విలవిల లాడింది.
హా సీతా హా లక్ష్మణా అంటూ..
మారీచుడు హాహాకారం చేసాడు.
రాముడు ఆశ్చర్చపోయాడు.
అది మాయజింక అని తెలుసుకున్నాడు.
లాభం లేదని వెనుదిరిగాడు. అక్కడ…
8. సీతాపహరణం
సీత మారీచుని అరుపులు విన్నది.
లక్ష్మణుడిని పిలిచింది. సంగతి అంతా చెప్పింది.
అన్న దగ్గరికి పొమ్మంది.
అన్నను కాపాడు అంది.
అది అంతా మాయ అన్నాడు లక్ష్మణుడు.
రామునికి ఏమీ కాదన్నాడు.
అమ్మ సీత వినలేదు. వదిన సీతగా మాట్లాడింది.
మా కష్టాలే నీకు ఇష్టం అన్నది.
లక్ష్మణుడు ఇక తప్పదు అనుకున్నాడు.
ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు.
మూడు గీతలు నేలపై గీసాడు.
వాటిని దాటవద్దు అన్నాడు.
అవి రక్షణరేఖలు అన్నాడు.
సరే – పొమ్మ న్నది సీతమ్మ.
అన్నను వెతుకుతు అతను పోయాడు.
సీతమ్మలోనికి వెళ్ళింది.
ఇక... వీలు చిక్కింది రావణునికి.
సీత ఒంటరి అని గమనించాడు.
తగిన సమయం అనుకున్నాడు.
భిక్షగాని రూపంలో వచ్చాడు.
భవతీ భిక్షాం దేహీ అని పెద్దగ అరిచాడు.
పర్ణశాల లోపల నుండి వచ్చింది సీతమ్మ.
పళ్ళూ బియ్యం తెచ్చింది.
భిక్షగాడు జోలెను ముందుకు తేలేదు.
బయటకు వచ్చి ఇమ్మన్నాడు.
గడపను దాటి ఇవ్వాలన్నాడు.
తప్పలేదు సీతమ్మకు.
సీత గీత దాటింది.
లక్ష్మణరేఖలు రక్షించలేక పోయాయి.
హమ్మయ్య అనుకున్నాడు రావణుడు.
అసలు రూపు ధరించాడు.
వికటాట్టహాసం చేసాడు.
సీత ఆ రూపాన్ని చూసింది.
వెంటనె మూర్ఛ తప్పింది.
అంతే... సీత పడిన నేలను పెకిలించాడు.
రథంలోని జాగ్రత్తగ పెట్టాడు.
ఆకాశాన రథం పరుగు పెట్టించాడు.
అక్కడ... లక్ష్మణుడు రాముని కలిసాడు.
ఇద్దరు తమ తమ సంగతులు చెప్పుకున్నారు.
మోసం జరిగిందని తెలుసుకున్నారు.
రాముడి మనసు కీడును శంకించింది.
పర్ణశాల దగ్గరికి పోయారు.
సీతమ్మ జాడ కనిపించలేదు.
పర్ణశాల చుట్టుపక్కల వెతికారు.
అయినా ఫలితం కనిపంచలేదు.
9. రామబంటు – మిత్రలాభం
అడవిలో సీతను వెతుకుతు ఉన్నారు.
రాముడి మనసు మనసులో లేదు.
అంగుళం అంగుళం గాలిస్తున్నారు.
దారిలో జటాయువు కనిపించాడు.
అతని రెక్కలు నరికి ఉన్నాయి.
సీతను రావణుడు తీసుకు పోయాడన్నాడు.
అడ్డగించినందుకు తన రెక్కలు విరిచాడన్నాడు.
పంపానదికి దారి చూపి చనిపోయాడు.
పంప దగ్గరికి వారిద్దరు పోయారు.
భక్త శబరిని కలిసారు.
శబరి ఇచ్చిన పండ్లను తిన్నారు.
సేద తీరారు.
ఆమె కిష్కిందకు పొమ్మన్నది.
దారిలో ఒక వృద్ధుడు కలిసాడు.
అన్నదమ్ముల గురించి అడిగాడు.
రాముడు అతడిని హనుమా అని పిలిచాడు.
అతడే అంజన పుత్రుడు ఆంజనేయుడు.
అప్పటి నుండి అతడు రామబంటు అయ్యాడు.
తను సుగ్రీవుని మంత్రిని అన్నాడు.
ఇద్దరినీ సుగ్రీవునితో కలిపాడు.
సుగ్రీవుని వెతలను తెలిపాడు.
సుగ్రీవుని అన్న మహాబలి వాలి.
వాలి సుగ్రీవుని రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు.
సుగ్రీవుని భార్యను చెరబట్టాడు.
సుగ్రీవుడు రాముని సాయం కోరాడు.
రామునికి అక్కరకు వస్తాను అన్నాడు.
వాలిని రాముడు చంపాడు.
ఇప్పుడు సుగ్రీవుడు కిష్కింధకు రాజు.
సీతను వెతకమని సైన్యం పంపాడు.
ఒక సైన్యపు మూకకు అంగదుడు నాయకుడు.
దానిలో హనుమంతుడు కూడ ఉన్నాడు.
రాముని ముద్రిక పొందాడు.
వారు దక్షిణ సముద్రం చేరారు.
జటాయువు తమ్ముడు సంపాతిని కలిసారు.
సంపాతికి విషయం చెప్పారు.
సంపాతి సీతను చూసాను అన్నాడు.
రావణుడే అపహరించాడని చెప్పాడు.
రావణ రాజ్యం శ్రీలంక.
లంకకు పోయే మార్గం చూపాడు.
సముద్రం దాటాలి అన్నాడు.
వానరులు అంతా నివ్వెర పోయారు.
ఒకరొకరుగ తమ శక్తిని చెప్పుకున్నారు.
హనుమంతుడు గమ్మున కూర్చున్నాడు.
జాంబవంతుడు హనుమ శక్తిని చాటాడు.
10. సముద్ర లంఘనం.
అంతా ఆహా ఓహో అన్నారు.
హనుమంతుడు కూడా తల ఊపాడు.
సముద్రం లంఘిస్తాను అన్నాడు.
తన శరీరాన్ని విపరీతంగా పెంచాడు.
రామేశ్వరం కొండలపై నిలబడ్డాడు.
హుమ్మని పైకి కుప్పించాడు.
ఆకాశంలో దూసుకు పోతున్నాడు.
దేవతలందరు ఉత్సాహంగా చూస్తున్నారు.
హనుమ నీడ జలధిపై పడుతున్నది.
సురస అనే నాగమాత సముద్రంలో ఉన్నది.
నీడతో హనుమను ఆకర్షిస్తున్నది.
హనుమను తింటాను అన్నది.
అది తనకు ఉన్న వరం అన్నది.
హనుమ సరేమరి తిను అన్నాడు.
శరీరం పెంచుతు పోయాడు.
సురస కూడా తన నోరు పెంచింది.
అంతకంతకు పెంచుతు పోతున్నారు.
హనుమ గబుక్కున చిన్నగ మారాడు.
సురస నోటిలో దూరాడు.
వెంటనె బయటికి వచ్చాడు.
సురస ఖంగుతిన్నది.
నోట్లోకి పోతే తిన్నట్టే కద మరి.
హనుమను ముందుకు సాగు అని దీవించింది .
సురసకు మొక్కాడు అంజని తనయుడు.
తిరిగి ప్రయాణం సాగించాడు.
ఇంతలో...
ఒక రెక్కల కొండ సముద్రం పైకి వచ్చింది.
దాని పేరు మైనాకుడు.
కొంతసేపు తనపై విశ్రాంతి తీసుకోమన్నాడు.
సమయం లేదన్నాడు హనుమ.
తప్పదు అన్నాడు మైనాకుడు.
కొండపై బొటనవేలు పెట్టాడు హనుమ.
అదే తనకు విశ్రాంతి అన్నాడు.
సంతోషం అన్నాడు మైనాకుడు.
ఇక లంక లక్ష్యంగా సాగాడు ఆంజనేయుడు.
చివరికి గమ్యం చేరుకున్నాడు.
బంగరు లంకను చేరాడు.
లంకను – సువర్ణ లంకను చేరాడు.
కిందికి విసురుగ దిగాడు.
ఎదురుగా లంక కోట ముఖద్వారం.
పెద్దగా ఉంది అది.
తలుపులు బలంగా ఉన్నాయి.
ఎదురుగా పోతున్నాడు హనుమ.
ఇంతలో...
11. అశోకవనం
లంకిణి ఎదురుగా నిలుచున్నది.
భయంకరంగా కనిపిస్తున్నది.
కోటను అది రక్షిస్తున్నది.
ఇద్దరు కొంతసేపు వాదులాడారు.
మాటామాటా పెరిగింది.
హనుమంతుడు మూతిపై ఒక్కటిచ్చాడు.
హనుమంతుని దెబ్బకు కుప్పకూలింది.
ఉత్సాహంగా లోపలికి అడుగుపెట్టాడు.
సీత కోసం అడుగు అడుగు వెతుకుతు ఉన్నాడు.
ఎందరో సుందరీమణులు.
మత్తుగా తూలుతు ఉన్నారు.
పరిచారికలు, పనివారు ఎందరెందరో.
ఏం లాభం, సీత మాత్రం కనిపించలేదు.
రావణుడి మందిరం చేరాడు.
ఒక స్త్రీ పడుకుని ఉన్నది.
సీత కాదు కదా అని సంశయం.
కాదు కాదు అని అనుకున్నాడు.
రాముడు లేని సీతకు నిద్రా..
ఈమె కాదు అని నిశ్చయం చేసుకున్నాడు.
ఎన్నో మందిరాలు అన్నీ అందమైనవి .
తిరిగాడు.. తిరిగాడు.. వెతికాడు.. వెతికాడు...
చివరికి ఒక వనం చేరాడు.
దాని పేరు అశోకవనం. ఒక చెట్టు కింద ఒక స్త్రీ.
జుట్టు విరబోసుకుని ఉన్నది.
చుట్టూ రక్కసి మూకల కాపలా.
ఆమె సీత అని నిశ్చయానికి వచ్చాడు.
సీతమ్మ చెంతకు చేరాడు.
రాముని ముద్రిక ఉంగరం చూపాడు.
రామబంటును అని నమ్మకం కలిగించాడు.
ధైర్యం నూరిపోసాడు.
ఆమెను తనతో రమ్మన్నాడు.
అమ్మ అందుకు ఒప్పలేదు.
రాముడు వచ్చి తీసుకుపోవాలి అన్నది.
హనుమంతుడు సరే అన్నాడు.
రామునికి చెపుతాను అన్నాడు.
ఇక వెళ్ళొస్తాను అన్నాడు.
సీత తన గుర్తు చూడామణిని ఇచ్చింది.
హనుమకు ఎంతో సంతోషం.
సీతమ్మను చూసిన ఆనందం.
తోటంతా కలియ తిరిగాడు.
కొమ్మ నుండి కొమ్మకు దూకాడు.
కుప్పిగంతులు వేసాడు.
ఎన్నో కొమ్మలు విరిచాడు.
గందరగోళం చేసాడు.
తోటంతా చిందరవందరచేసాడు.
12. లంకాదహనం
తోట రక్షకులు చూసారు.
హనుమను బెదిరించారు.
అతని ధాటికి నిలువలేక పోయారు.
పోయి రావణునికి చెప్పారు.
రావణుడు చిరాకు పడ్డాడు.
గొప్ప గొప్ప యోధులను పంపించాడు.
కొందరు హనుమ చేతిలో చచ్చారు.
కొందరు దెబ్బలు తిని వచ్చారు.
కొడుకు ఇంద్రజిత్తును పంపాడు.
ఇంద్రిజిత్తు బ్రహ్మాస్త్రమును వేసాడు.
హనుమంతుడు దానికి లొంగాడు.
హనుమను తాళ్ళతో కట్టేసారు.
రావణుని ముందర నిలిపారు.
హనుమ సీతను తిరిగి పంపమన్నాడు.
రావణుడు ఆ మాటలు వినలేదు.
హనుమను పరిహాసం చేసాడు.
తోకకు నిప్పు అంటించమన్నాడు.
రాక్షసులు తోకకు బట్టలు చుట్టారు.
దానిపై నూనెను పోసారు.
ఆపై తోకకు నిప్పు అంటించారు.
కట్టిన కట్లను విప్పేసారు.
హనుమ ఇక గంతులు వేసాడు.
ఇంటిపై నుండి ఇంటికి దూకాడు.
భవనం నుండి భవనం పైకి గెంతాడు.
అంతా లంకకు నిప్పు అంటించాడు.
సువర్ణలంక దగ్ధం అవుతున్నది.
సముద్రం ఒడ్డకు వెళ్ళాడు.
మంటలు చల్లగ చేసుకున్నాడు.
కాలుతున్న లంకను చూసాడు.
చూసి రమ్మంటే కాల్చి వచ్చాను - అనుకున్నాడు.
గర్వంగా సముద్రాన్ని లంఘించాడు.
13. సేతునిర్మాణం.
ఆనందంతో సముద్రాన్ని దాటేసాడు.
మిత్రులకు అంతా సంగతి చెప్పేసాడు.
అంతా గంతులు వేసారు.
హనుమంతుని అభినందించారు.
ఆనందంగా అందరు కలిసి...
సుగ్రీవుని వద్దకు పోయారు.
రాముడికి హనుమ విషయం చెప్పాడు.
సీత ఇచ్చిన గుర్తును చూపాడు.
రాముడు హనుమను కౌగిలించాడు.
ఇక లంకపై యుద్ధం అనుకున్నారు.
సైన్యం మొత్తం కదిలింది.
సముద్రం ఒడ్డుకు చేరింది.
మరి సముద్రం ఎలా దాటాలి.
అందరు కలిసి యోచించారు.
వంతెన కడదాం అనుకున్నారు.
రాళ్ళను వాడదాం తెమ్మన్నారు.
రాళ్ళను సముద్రంపై వేస్తుంటే...
అన్నీ మునుగుతు ఉన్నాయి.
సముద్రుని వేడుదాం అనుకున్నారు.
రాముడు ప్రార్థన చేసాడు.
సముద్రుడు ఉలుకులేదు పలుకు లేదు.
రాముడికి కోపం వచ్చింది.
సముద్రుడు గడగడ వణికాడు.
నీలుడనే వానరుడు రాయి వేస్తే..
రాయి మునుగదు అన్నాడు.
ఎన్నో రాళ్ళు తెచ్చారు.
ఉడుత కూడ ఇసుకను తెచ్చింది.
రాముడు దానిని చూసాడు.
ప్రేమతొ దాని వీపును నిమిరాడు.
అందుకే దాని వీపుపై రేఖలు ఏర్పడ్డాయి.
వంతెన సులువుగ కట్టారు.
సముద్రాన్ని అవలీలగ దాటేసారు.
అంత వానర కోలాహలం.
లంకపైన కాలు పెట్టారు.
అంగదుడు రాయబారం పోయాడు.
రావణుడికి కబురు అందించాడు.
14. యుద్ధం
రావణుడు విషయం తెలుసుకున్నాడు.
యుద్ధానికే సై అన్నాడు.
సీతను మాత్రం విడువను అన్నాడు.
భార్య మండోదరి మాట వినలేదు.
హోరాహోరీ యుద్ధం మొదలయ్యింది.
ఒక్కొక్కరే మరణిస్తున్నారు.
బంధువు లెందరో మరణించారు.
తన కొడుకు ఇంద్రజిత్తును పంపాడు.
అతడు మాయోపాయం పన్నాడు.
లక్ష్మణునిపై బాణం వేసాడు.
లక్ష్మణుడు మూర్ఛపోయాడు.
హాహాకారం రేగింది.
వానరులందరూ రోదించారు.
అంతా ఆందోళన చెందారు.
హనుమంతుడు సంజీవని తెచ్చాడు.
లక్ష్మణుడు తేరుకున్నాడు.
ఇంద్రజిత్తును తుదముట్టించాడు.
రావణుడు చాలా కుంగి పోయాడు.
తమ్ముడు కుంభకర్ణుడిని నిద్రలేపాడు.
అతడు కూడ రామునిచేత చచ్చాడు.
తుదకు రావణుడే వచ్చాడు.
రాముడు బాణం వేసాడు.
రావణుడు కూడ మరణించాడు.
జయజయ ధ్వానాలు మోగాయి.
సీతను విడుదల చేసారు.
సీతారాములు ఇద్దరు కలిసారు.
దేవతలందరు సంతోషించారు.
పూలవాన కురిపించారు.
అందరు అయోధ్యకు వెళ్ళారు.
భరతుడు ఎదురు చూస్తున్నాడు.
రాగానే రామునికి రాజ్యం అప్పగించాడు.
పట్టాభిషేకం జరిగింది.
రాముడు రాజు అయ్యాడు.
అందరు సుఖంగా ఉన్నారు.
మీరు కూడా ఇంటికి పోయిరండి.
Comments